తిరుమల తిరుపతి దేవస్థానం.. దేవుడిని
ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలంటారు పెద్దలు. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్
కలుగుతుంది. ఆ భావనను వ్యక్తపరచలేం. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా
ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా
అనిపిస్తుంది. అందుకే కాబోలు.. తిరుమలకు జనాలు క్యూ కడుతుంటారు. అయితే.. కేవలం
శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షల మంది తిరుమలకు వెళ్తారు. కానీ.. తిరుమల
శ్రీవారి ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అవేంటో
తెలుసుకుందామా…
టీటీడీ(తిరుమల
తిరుపతి దేవస్థానం) అనే ఓ స్వతంత్ర సంస్థ నేతృత్వంలో తిరుమల ఆలయ నిర్వహణ
జరుగుతుంది. టీటీడీలో దాదాపు 15000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారట.
టీటీడీ కింద తిరుమల ఒక్కటే కాదు.. మొత్తం 12 ఆలయాలు ఉన్నాయట.
1830 సమయంలోనే తిరుమలలో భక్తులు చెల్లించే కానుకల నుంచి
ఈస్టిండియా కంపెనీకి ఏడాదికి లక్ష దాకా పన్ను వచ్చేదట. తిరుమల గుడిలో దాదాపు 11
టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయట. ఇక.. స్వామి వారికి వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే
ముస్లిం శ్రీవారికి సమర్పించాడట.
తిరుమలలో
శ్రీవారికి ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. తిరుప్పావడ అంటే
సుమారు 450
కిలోల అన్న ప్రసాదం, లడ్డు, వడ, దోస, పాయసం, జలేబీ తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యంలా సమర్పించడమే.
1983 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భక్తుల కోసం వైకుంఠం క్యూ
కాంప్లెక్స్ ను నిర్మించారు. రోజూ ప్రతి ఇంట్లో మోగే వెంకటేశ్వర సుప్రభాతాన్ని
పాడింది ఎంఎస్ సుబ్బలక్ష్మి.